💥అన్నదాన మహిమ!
⚜️🕉️🚩ఓం అన్నపూర్ణాయై నమః🌹🙏
💥అన్నదాన మహిమ!
పూర్వం ఓ బ్రాహ్మణుడుండేవాడు. వేళగాని వేళ తన యింటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగక పోయినా సరే, ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒక వేళ ఇంటికెవరూ రాకపోతే, వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు.
ఇలా చాలా కాలం జరిగాక, ఒకనాడాయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవళ్ళను అడిగినా చెప్పలేకపోయారు.
ఒకాయన "అన్నదాన మహమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే, కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే, స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే , అడిగి తెలుసుకోండి” అని సలహా ఇచ్చాడు.
అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య ఐన పార్వతీదేవి అన్నమాట.ఆవిడకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు.
మన బ్రాహ్మడు కాశీ వెళ్లి గంగ ఒడ్డున కూచుని పార్వతీ దేవి గురించి గాఢంగా తపస్సు చేశాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై ‘నీకేం కావాలి?’ అని అడిగింది.
బ్రాహ్మడు సాష్టాంగ నమస్కారం చేసి, ”అన్నపూర్ణాదేవీ, నాకేమీ కోరిక లేదు. కాని, అన్నదాన మహమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈసంగతి మీరే చెప్పాలి గాని ఇతరుల వల్ల కాదు” అని తన మనసులో వుద్దేశం వెల్లడించాడు.
అప్పుడు దేవి అతనితో ”నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నీవు తెలుసుకునే ఉపాయం చెబుతాను విను!
హమవత్పర్వతం దగ్గర హమవతమని ఒక పట్టణం ఉంది. ఆపట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వాయన దగ్గరకు వెళ్లి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి ‘బాబూ మీకేం కావాలని' అడుగుతాడు.
అప్పుడు నీవు, ‘నాకు పెద్ద కోరిక ఏమీ లేదు. నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణీ కూడా ఉండకూడదు ‘ అని చెప్పు.
'ఇంతేగదా?’ అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ని ‘అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి ?’ అని అడిగి తెలుసుకో” అని చెప్పింది.
బ్రాహ్మణుడు ‘సరే’ అని చెప్పి హమవతానికి బయలుదేరి వెళ్లాడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతోంటే, ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి ”ఏం బాబూ, దారి తప్పి పోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్లాలి?” అన్నాడు.
'హమవత పర్వతం దగ్గరికి పోవాలి’ అన్నాడు బ్రాహ్మణుడు. ”బాబూ, దారితప్పి ఆమడ దూరం వచ్చేశావు. సాయంత్రమయి పోయింది. పులులు, సింహాలూ ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చెయ్యకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగిపోండి” అన్నాడు బోయవాడు.
బ్రాహ్మడు రాత్రికి అక్కడ ఉండి పోయాడు బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు యింటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు.
అనపకాయలూ, కంది కాయలూ, పెసర కాయలూ కావలసినన్ని ఉన్నా యి గాని వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు. ఎలాగ మరి? అని ఆలోచించాడు. బ్రాహ్మణుడు.
‘నాయనా, నాకేమీ వద్దు. నువ్వు చేసిన ఆదరణవల్ల నా శ్రమ, ఆకలీ తీరిపోయాయి. ఆలోచించక పడుకో’ అన్నాడు. కాని బోయవాడికి ఆ బ్రాహ్మడిని పస్తు పెట్టడమంటే మనస్సు ఒప్పింది కాదు. అంచేత ఇంత చారపప్పూ పుట్ట తేనే తెచ్చి ఇచ్చి, వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు.
బ్రాహణుడు అవి తీసుకొని, అంగోస్త్రం పరుచుకుని, కింద పడుకోబోతూంటే, బోయవాడు, ‘అయ్యో, కిందపడుకోబాకండి. పులులు వస్తాయి ‘ అని చెప్పి, ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకో బెట్టి, తాను కింద ఉండి, విల్లూ, అమ్ములూ పుచ్చు కుని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మడికి కాపలా కాశాడు.
తెల్లవారు ఝామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడ నుంచో ఓపులి వచ్చి, పాపం ఆ బోయ వాడి మీద పడి చంపేసింది.
బ్రాహ్మణుడు నిద్ర లేచి, జరిగినదంతా తెలుసుకుని, తన మూలాన ఆ బోయవాడు పులివాత బడ్డాడని ఎంతో విచారించాడు. బోయ వాని భార్య బాహ్మణునితో ”స్వామీ, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి. మీకు హమవతానికి దారి చూపిస్తాను , నడవండి” అని, ఆయనను తీసికెళ్లి దారి చూపెట్టి, వెనక్కి తిరిగివచ్చి, భర్తతో పాటు సహగమనం చేసింది.
ఆ బ్రాహ్మణుడు బోయదంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు.
పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వా లనికోరగా రాజు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి, చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది.
బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి, ‘అన్న దానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు’ అని అడిగాడు.
అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవానికి మల్లే ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో యిలా అన్నాడు. "పది నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే, మిమ్మల్ని తీసుకెళ్లి చారెడు చార పప్పూ, పుట్ట తేనే ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండీ ! ఈమాత్రపు దానానికే ఈ రాజుగారికి కుమారుడై పుట్టి, రాజ్యమేలబోతున్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు, నిత్యం అన్న దానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహంచుకోండి" ఇలా చెప్పేసి, ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపాపలాగ ‘తువ్వా, కువ్వా’ అని ఏడవడం ఆరంభించాడు.
బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి, తన వూరు తిరిగివచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పటి నుంచి అన్న దానం చేస్తూ ధన ధాన్యం, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment