వైశాఖపురాణం 20వ అధ్యాయము
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 20. 20వ అధ్యాయము - పిశాచత్వ విముక్తి నారదుడు అంబరీషునకు వైశాఖమహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి యింకను వైశాఖ మహాత్మ్యమును దయయుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను. శ్రుతదేవుడిట్లనెను, రాజా! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము. వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము. పూర్వము గోదావరి తీ...