మాఘపురాణం - 28వ అధ్యాయము

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥 మాఘపురాణం - 28వ అధ్యాయము


విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ


పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదము జరిగింది. శివుడు నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు. కాదు, బ్రహ్మదేవుడు ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను కనక నేనే గొప్ప అన్నాడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయాయి. సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అప్పుడు శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములు ఇమిడి ఉన్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రములు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపిస్తున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేక సర్వత్రా తానే అయి అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు అందరు భగవంతుని కీర్తిస్తూ కనపడుతున్నారు.


నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములు సమస్తము కనపడుతున్నాయి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతు కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశిస్తున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశముతో ఉన్నాడు. ఆ విరాట్ రూపమునకు మొదలు, చివర ఎక్కడో తెలియడము లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులనీ, బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు.


ఇద్దరు వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఆహా! ఏమి ఇది? బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక పోయాము అంటే మనం అధికులము కాదన్నమాట. సమస్తమునకు మూలాధారము, సృష్టి స్థితి లయ కారకుడు, సర్వాంతర్యామి జగములనేలే జగదాధారుడు శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడు. పంచభూతములు, సూర్యచంద్రులు, సర్వము ఆ శ్రీమన్నారాయణుడే. మనమంతా ఆయన కుక్షిలోని కణములమని నిర్ణయించుకుని శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపము వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలమునుండి వాదించు కొంటున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపముయొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేసారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో చెపుతాను వినండి. ఈ సృష్టి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి. వీటీనే త్రిగుణములు అంటారు. అవి సత్త్వరజస్తమోగుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్త్వరజస్తమో గుణములు కలిగిఉంటారో వారే గొప్పవారు. ఏకాత్మస్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి. అవి సృష్టిస్థితి లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసాను. వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు ఏక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులము అయినాము. మీరు వేరు, నేను వేరు అనునది లేదు. అంతా ఏకత్వస్వరూపమే. మన ముగ్గురిలో ఎవరికి పూజ చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదము ఉండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తించారు. శాంతము పొంది ప్రవర్తించండి. బ్రహ్మదేవా! నా నాభికమలము నుండి ఉద్భవించావు కదా! నీకును, నాకును భేధము లేదు. ఓ మహేశ్వరా! ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడు ఒకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీయొక్క మహిమను సర్వస్వమును వినిపించాను. నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకమూలకు విస్తరింప చేసాడు. నువ్వు నిర్వికార నిరాకల్పుడవు. శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు, ఆత్మ స్వరూపుడవు నువ్వే. భోళా శంకరుడవైన నువ్వు ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజించి పూజిస్తారు. నిత్య సత్య స్వరూపుడవు. నిత్యానంద రూపుడవు. నిత్య ధ్యాన స్వరూపుడవు. అర్థనారీశ్వరుడవు. నువ్వు నాతో సమానుడవు” అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసాడు. మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులు ఆవుటయే కాక స్వర్గర్హత పొంది సుఖములను పొందుతారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు