మాఘపురాణం - 27వ అధ్యాయము

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥 మాఘపురాణం - 27వ అధ్యాయము


ఋక్షక అనే బ్రాహ్మణ కన్య వృత్తాంతము


పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షక అను కన్య జన్మించి దిన దినాభివృద్ధిగా పెరుగుతున్నది. దురదృష్టము కొద్దీ పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాడు.


ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభింది.


చాలా సంవత్సరములు చేయటము వలన అనేక మాఘ మాస స్నాన ఫలము దక్కింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ ప్రాణములు విడిచి పెట్టింది. ఆరోజు వైకుంఠ ఏకాదశి అవడముచే వైకుంఠమునకు వెళ్ళింది. చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు వెళ్ళింది. ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలు అయినందున బ్రహ్మదేవుడు ఆమెను దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమ” అన్న పేరుతో సత్యలోకమునకు పంపాడు. 


ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసారు. వారి తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుము” అనగా “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్మ” ని వేడుకొన్నారు. బ్రహ్మ అలాగే ఇచ్చానని చెప్పి అంతర్ధానము అయ్యాడు.


బ్రహ్మదేవుని వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వముతో దేవతలను హింసించి, మహర్షుల తపస్సులకు భంగము కలిగిస్తూ, యజ్ఞయాగాది క్రతువులలో మాంసం, రక్తం, వేసి నానాభీభత్సములు చేయసాగారు. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసారు.


ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని “మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరు ఇచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలురను బాధిస్తూ దేవలోకమునకు వచ్చి మమ్ములను తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేస్తున్నారు. వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించమ” ని దేవేంద్రుడు ప్రార్థించాడు.


బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి “అమ్మాయీ! సుందోపసుందులను రాక్షసులకు ఎవరి వలన మరణం కలుగదని వరం ఇచ్చి ఉన్నాను. వర గర్వంతో వాళ్ళు చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. నువ్వు వెళ్ళి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగు విధముగా ప్రయత్నించు” అని చెప్పాడు.


తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుతూ అరణ్యములో ఆ రాక్షస సుందోపసుందులు ఉన్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదము, ఆమె మధుర గానము విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించారు. ఆమె ఎటు వెళ్ళినా, ఎటు తిరిగినా ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుతూ ఆమెను “నన్ను వరింపుమ” ని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడ సాగారు.


తిలోత్తమ “ఓ రాక్షసాగ్రేసరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరు ఇద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి పట్ల ప్రేమతో ఉన్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది. నాకు బలవంతులైన వారిని వరించవలెనన్న ఒక కోరిక ఉన్నది. “మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను వరించగలను” అని చెప్పింది. తిలోత్తమ మాటలు వారిని ఆలోచింప చేసాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. వాదము పెరిగి పౌరుషం వచ్చి ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్లయుద్ధము చేసారు. పలురకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తితో మరొకరి కంఠానికి ఖండించు కోవడముతో ఇద్దరూ చనిపోయారు. ఇద్దరూ మరణించడముతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలువిధముల శ్లాఘించారు.


బ్రహ్మదేవుడు కూడా సంతోషించి “తిలోత్తమా! నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలు అయినావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితము. ఇకనుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళి దేవలోకములో సుఖించు” అంటూ ఆమెను దేవలోకమునకు పంపాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు