💥వైశాఖమాసం విశిష్టత💥
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹
💥వైశాఖమాసం విశిష్టత💥
ఆథ్యాత్మికత పరంగా వైశాఖానిది ప్రత్యేక స్థానం. శ్రీమహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి దీనికి "#మాధవమాసం" అని పేరు కూడా ఉంది.
వైశాఖమాస మహత్మ్యం గురించి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన వైశాఖమాసంలో రోజూ పుణ్యదినమే.
పున్నమిచంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసిదళాలతో శ్రీమహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజించినవారికి ముక్తిదాయకం అని పురాణాలలో తెలుపబడింది.
వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది, యజ్ఞాలు, తపస్సులు, పూజలు, దానధర్మాలకు, నదీ స్నానాలకు ఉత్తమమైన మాసం.
నదీ స్నానం చేయలేనివారు గంగ, గోదావరి, యమునా మొదలైన పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువలలో, చెరువులలో, బావుల దగ్గర లేకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి. ఎందుకంటే నీటిలో సమస్త దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
వైశాఖ మాసం మొత్తం స్నానం చేయలేనివారు కనీసం మూడు రోజులు అయినా స్నానం చేయాలి.. అవి శుక్లపక్ష త్రయోదశి, చతుర్ధశి, పూర్ణిమ తిథులు.
వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఎండలు అధికంగా ఉంటాయి. కాబట్టి వేడి నుండి ఉపశమనం కలిగించేవి అంటే నీరు, గొడుగు, విసనకర్ర, చెప్పులు దానం చేయడం అత్యంత శ్రేష్ఠం.
వైశాఖ మాసంలో అక్షయతృతీయ, పరశురామజయంతి, ఆదిశంకర జయంతి, భగవద్రామానుజ జయంతి, నారసింహ జయంతి, సత్యనారాయణ స్వామి కల్యాణం, మోహిని ఏకాదశి, హనుమత్ జయంతి, బుద్ధపూర్ణిమ, సంపద్ గౌరీ వ్రతం వంటి పర్వదినాలు ఉన్నాయి.
వైశాఖ మాసంలో అన్నదానాలు, వస్త్ర దానాలు, బియ్యం, మంచం, మామిడిపళ్ళు, మజ్జిగ, ఆవునెయ్యి, చెరుకురసం, అరటిపళ్ళు దానం చేసిన వారు అనంతమైన పుణ్యఫలాలు పొందుతారు.
ఈ మాసంలో స్నాన, పూజ, దానధర్మాల లాంటివి ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయనేది పురాణ కథనం.
వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటు శ్రీహరి భూలోకంలో విహరిస్తారని, అత్యంత ప్రీతికరమైన తులసీదళాలతో పూజించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలు, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
వైశాఖం మాసం బహుళ దశమి రోజున "#హనుమజ్జయంతి"గా జరుపుతారు. ఆంజనేయస్వామిని సింధూరం, తమలపాకులతో పూజించడంతో పాటూ వడమాలను వేసి, చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి.
వైశాఖ శుద్ధ చతుర్దశినే "#నృసింహజయంతి" అంటారు. హిరణ్యకశిపుని అంతం చేయడానికి శ్రీమహావిష్ణువు అవతరించిన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి, వ్రతం చేసి, స్వామి ఉద్బవించిన స్తంభం, ఇంటిగడపలను పూజిస్తారు.
వైశాఖ పూర్ణిమకి "#మహావైశాఖి" అంటారు. దశావతారాల్లో రెండోదైన కూర్మరూపుడిగా శ్రీహరి ఈ రోజునే అవతరించాడు.
అలాగే బుద్ధుడి జన్మదినం కూడా ఈరోజే. ఇంతటి విశిష్టత కలిగిన ఈ రోజున సముద్రస్నానం, విష్ణు పూజ, సత్యనారాయణస్వామి వ్రతం చేయడం ఉత్తమం.
వైశాఖ శుద్ధ పంచమినాడు జగద్గురువుగా ఖ్యాతి చెందిన శ్రీఆదిశంకరాచార్యులు, షష్టినాడు విశిష్టాద్వైతకర్త, వైష్ణవభక్త శ్రేష్ఠుడు శ్రీరామానుజాచార్యులు జన్మించారు.
అలాగే పరశురామ, శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ, నారద జయంతులు కూడా వైశాఖం లోనే కావడం మరో విశిష్టత. ఈ మాసంలో ఆచరించాల్సిన విధుల వెనుక ఆరోగ్య పరమైన రహస్యాలు దాగి ఉన్నాయి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment