⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥
కార్యసిద్ధిదాయినిగా, సంపత్ప్రదాయినిగా మహాలక్ష్మీ దేవిని పూజించడం మన దేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ప్రత్యేకించి శ్రావణ, మార్గశిర మాసాల్లో లక్ష్మీ ఆరాధన అభీష్టాలను నెరవేరుస్తుందన్న విశ్వాసం ఉంది.
దేశంలో అత్యంత పురాతనమైన లక్ష్మీ మందిరంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి.
పంచగంగ నదీ తీరాన శ్రీ మహాలక్ష్మి కొలువైన క్షేత్రం కొల్హాపూర్. పూర్వం దీన్ని ‘కరవీరపురం’ అనేవారు. ఇక్కడ అమ్మవారిని ‘కరవీర వాసిని’గా, ‘అంబాబాయి’గా పిలుస్తారు.
కాశీ అంతటి ప్రాచీన క్షేత్రంగా... ఆరువేల ఏళ్ళ నాటిదిగా కొల్హాపూర్ భక్తులు పరిగణిస్తారు. కాశీని విడిచిపెట్టి మహా శివుడు ఉండడనీ, అదే విధంగా మహాలక్ష్మి స్థిర నివాసం కొల్హాపూర్ అనీ ప్రతీతి. ఈ క్షేత్ర ప్రస్తావన దేవీ భాగవతంలో, స్కాంద పురాణంలో ఉంది.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఏడవదిగానూ కొల్హాపూర్కు విశిష్టత ఉంది. సతీదేవి దేహంతో శివుడు తాండవం చేస్తున్నప్పుడు.. ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడ్డాయనీ, సర్వేంద్రియాల్లో నయనాలకు ఎంతటి ప్రాధాన్యం ఉందో... శక్తి పీఠాల్లో కొల్హాపూర్కు అంతటి ప్రత్యేకత ఉందనీ పెద్దలు చెబుతారు.
పురాణ గాథల ప్రకారం, వైకుంఠానికి వెళ్ళిన తన రాకను మహా విష్ణువు గమనించలేదని భృగు మహర్షి ఆగ్రహించి, విష్ణుమూర్తి వక్షస్థలం మీద కాలితో తన్నాడు. తాను కొలువుండే చోటును తన్నిన భృగువును విష్ణువు ఆదరించడం భరించలేక... మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి, తపోదీక్ష చేపట్టింది. ఆమె తపస్సు చేసిన ప్రదేశమే కొల్హాపూర్ అని పురాణాలు చెబుతున్నాయి.
జగత్ప్రళయం సంభవించినప్పుడు శివుడు తన త్రిశూలం కొన మీద కాశీ క్షేత్రాన్ని పైకెత్తి రక్షించాడనీ, అదే విధంగా లక్ష్మీదేవి తన చేతులతో కొల్హాపూర్ క్షేత్రాన్ని పైకెత్తి కాపాడిందనీ... అందుకే దీనికి ‘కరవీరపురం’ అనే పేరు వచ్చిందనీ మరో కథ ఉంది. ఈ అమ్మవారిని ‘కరవీర మహాలక్ష్మి’ అని కూడా వ్యవహరిస్తారు.
కొల్హాపూర్ ఆలయంలో సింహవాహినిగా... నాలుగు చేతుల్లో గద, పాత్ర, ఫలం, డాలు ధరించిన మహాలక్ష్మి భక్తులకు దర్శనం ఇస్తుంది.
ఈ ఆలయానికి అనుబంధంగా తుల్జాభవానీ, శివుడు, వినాయకుడు, కాలభైరవుడు, శ్రీ వేంకటేశ్వర స్వామి నవగ్రహాలు తదితర ఉపాలయాలు ఉన్నాయి. మహా కాళీ, మహా సరస్వతులను కూడా ఈ ఆలయ గోపురాల వద్ద దర్శించుకోవచ్చు.
దత్తాత్రేయ స్వామి ప్రతి రోజూ మధ్యాహ్నం ఈ ఆలయానికి వచ్చి, భిక్ష స్వీకరిస్తాడట. ఆయనకు కూడా ఒక ఉపాలయం ఇక్కడ ఉంది.
ఏడాదికి రెండుసార్లు... మూడు రోజుల పాటు అమ్మవారి విగ్రహం మీద సూర్యకిరణాలు పడడం మరో విశేషం. తొలిరోజు పాదాలపైనా, రెండో రోజు మధ్యభాగంలో, మూడో రోజు ముఖం పైనా ఈ కిరణాలు ప్రసరిస్తాయి.
శ్రీ శంకరాచార్యులు ఈ ఆలయాన్ని దర్శించి, శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. అయిదు సమున్నతమైన గోపురాలున్న ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 634లో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
ఈ ఆలయంలో శుక్రవారాల్లో, పౌర్ణమి తిథుల్లో విశేష పూజలు జరుగుతాయి. దేవీ నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment