⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏

 ⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏


శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం!

సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం!

ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం!

రామం నిశాచర వినాశకరం నమామి!!


💥అయనము అంటే నడక అని అర్థం. రామాయణము అంటే రాముని యొక్క నడక అని అర్థం.


మీరు చూడండి శ్రీ మహవిష్ణువు యొక్క దశావతారములలో ఒక్క రామావతారములో తప్ప ఇక ఏ అవతారము గూర్చి ప్రస్తావించినా పెద్దలు అయనము అన్న మాట వేయ లేదు, ఎందుకు ?


రామావతారంలొ స్వామి పరిపూర్ణముగా మానవుడే, అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడినని కాని, దైవత్వమును ప్రకటించడము కాని చేయడు. ఆయన ఆ అవతారంలో మానవునిగానే జీవించాడు.


అంతా బాగుందండీ కాని మరి “రామస్య ఆయనం రామాయణం” కదా మరి రాముని కదలికకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది?


అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం. మరొ అడుగు వేస్తే అది సత్యం. ఆయన నడక ఆయన కదలిక అంతా సత్య - ధర్మములే. అందుకే కదండీ “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు.


అందుకే పెద్దలు తరచు ఒక విషయం చెప్తారు. రామాయణాన్ని నరుడి కథగా చదవండి అని, ఎందుకంటే రామాయణాన్ని నరుడి కథగా మనం చదివినప్పుడు రాముని నడవడిని చూసినప్పుడు ఒక నరుడు సత్యాన్ని ధర్మాన్ని పట్టుకొని ఇలా జీవించ గలడా, అని మనం కూడా ఆ గుణాలని అలవర్చుకొనే వీలుంటుంది.


అసలు “రామ” శబ్దం లోనే గొప్పతనం ఉంది. ”ఓం నమో నారాయణాయ” అన్న అష్టాక్షరీ మహమంత్రంలోని “రా” బీజాక్షరాన్ని “ఓం నమః శివాయ” అన్న పంచాక్షరీ మహామంత్రం లోని “మ” బీజాక్షరాన్ని తీసుకువచ్చి “రామ” అన్న పేరుని దశరథాత్మజునికి వశిష్టులు పెట్టారు అని అంటారు


“రమయతి ఇతి రామః ” అని ఉక్తి. రామ అన్న మాట తోనే హృదయము రమిస్తుంది. అందుకు కాదా “శ్రీ రామ నీ నామమెంతో రుచిరా” అని రామదాసు గారు ఎలుగెత్తి పాడినది.


అలాగే రామ అని మనం అనేటప్పుడు ‘రా’ అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపములు బయటకు వచ్చి దహింపబడతాయని.. ”మ” అక్షరం పలికే సమయం లో నోరు మూసుకొని బయట ఉన్న పాపములు లోనికి రాకుండా ఉంటాయని ఆర్యోక్తి.


అలాగే “రా” అన్న అక్షరం భక్తులను సంసార సాగరం నుండి రక్షిస్తే ,”మ” భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తుందని పెద్దలైన వారు నిర్వచించారు.


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||


పరమశివుడు పార్వతీ దేవితో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసినదే, శ్రీ రామ రామ రామ అని మూడు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలము వస్తుందనేది ఈ శ్లోక భావం.


అదెలా అంటే కటపయాది సూత్రం ప్రకారం “య” వర్గం లో “రా” రెండవ అక్షరం కాగా “ప” వర్గం లో “మ” ఐదవ అక్షరం. రెండు * ఐదు =పది కదా, దీనిని బట్టి ఒకసారి రామ అంటే పది సంఖ్య కు సంకేతం. ఇక మూడు సార్లు జపిస్తే 10*10*10 =1000 కి సమానమవుతుంది. అందుకే పరమశివుడు అలా నిర్వచించాడు అని.


ఈవిధంగా అవతరించి నరుడిగానే చరించి, సత్య ధర్మాలను పట్టుకొని, పితృ భక్తి, ఏకపత్నీ వ్రతము, భ్రాతృ ప్రేమ, కర్తవ్య నిష్ట వంటి సద్గుణములను సొదాహరణము గా చూపించిన ఆ శ్రీరామ చంద్ర ప్రభువు యొక్క పాదపద్మములకు సాంజలి బంధకముగా నమస్కరిస్తూ ఆ ప్రభువు యొక్క కృప మనపై వర్షించాలని కోరుకుంటూ మన జీవితాలను పండిచుకుందాం.


మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే!

చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం!!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు