⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏


లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం

దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్‌ బ్రహ్మంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం


రెండు చేతులలో మాలలను ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. 


మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ దేవి.


మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, లక్ష్మీ నారాయణులు వేరు వేరు కాదని చెప్పబడింది.

సృష్ట్యాదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీ దేవిని ప్రసాదించిందని దేవీభాగవతంలో ఉంది.


భృగు మహర్షి భార్య ఖ్యాతి. ఆమె పుత్రికా సంతానానికై తపస్సు చేస్తే ఆదిపరాశక్తి అంశతో ఆమె భార్గవిగా జన్మించింది.


లక్ష్మీదేవి.. స్వారోచిష మన్వంతరంలో- అగ్నినుంచి

ఔత్తమ మన్వంతరంలో స్వచ్ఛమైన గాలి నుంచి,

తామస మన్వంతరంలో భూమి నుంచి,

రైవత మన్వంతరంలో – బిల్వం నుంచి,

చాక్షుష మన్వంతరంలో- సహస్ర దళ పద్మం నుంచి,

వైవస్వత మన్వంతరంలో ఫాల్గుణ మాసం ఉత్తరా నక్షత్రంలో శుక్రవారం నాడు క్షీరసాగరం నుంచి ఉద్భవించిందంటారు.


దూర్వాస మహాముని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి పాల సముద్రంలో నివసించింది. 


అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించగా, పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది.


క్షీరసాగర కన్యగా లక్ష్మీ అవతరణం ఒక సంకేతార్థంగా భావిస్తారు. 


ఈ జగత్తు ఒక సాగరం.

మానవులలో సద్గుణాలు, దుర్గుణాలను దేవ దానవులుగా సంపద కోసం చేసే మథనమే క్షీరసాగర మథనం.


క్షీరసాగరం అనేక సంపదలకు నిలయం. ఇలా మథనంలో హాలాహలం వంటివి చేదు అనుభవాలు. మరింత పట్టుదలతో, విశ్వాసంతో అధికంగా సాధన చేస్తే, భగవం తుడు శివరూపంలో అనుగ్రహంచి, సంపదలు సమకూరుస్తాడని, ఈ సంపదలను భగవదర్పితంగా స్వీకరించాలని సందేశం అందిస్తుంది పురాణ కథనం.


శ్రీలక్ష్మి కారుణ్య రూపిణి. మంగళకరమైనవి, ప్రకాశనీయమైనవి, ఘనమైనవి, పవిత్రమైనవి, అదృష్టమైనవి అయిన పదార్ధాలన్నీ ఆ తల్లి కటాక్షం ప్రసరించడం వల్లనే ఏర్పడ్డాయని విశ్వసిస్తారు.


విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుంది. లక్ష్మిని పలురకాలుగా పలు రూపాల్లో ఆరాధిస్తున్నారు.


ఆమె రాజ్యలక్ష్మి, జయలక్ష్మి, ధనలక్ష్మి వంటి రూపాల్లో పూజలు అందుకుంటూ ఉండగా, అష్టోత్తర శతనామ స్తోత్రం , సహస్రనామ స్తోత్రం వంటివి పఠిస్తే భక్తులకు ప్రసన్నురాలు అవుతున్నదని పండితులు చెపుతారు. ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు