భాద్రపద మాస కృష్ణపక్షం.. మహాలయపక్షం (పితృపక్షం)

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


భాద్రపద మాస కృష్ణపక్షం.. మహాలయపక్షం (పితృపక్షం) 


కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే

యాచిత్వాపి నరః కుర్యాత్‌ పితూృణాం తన్మహాలయం


"విశిష్టమైన మహాలయ పక్షంలో పెద్దల కోసం శ్రార్థ కర్మలు తప్పనిసరిగా చేయాలి. అందరికీ అలా చేయగలిగే స్థోమత ఆర్థికంగా లేకపోవచ్చు. అటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు... యాచించయినా ఆ విధిని నిర్వర్తించి, పితృదేవతల ఋణం తీర్చుకోవాలి’’ అని పూర్వీకులు పేర్కొన్నారు.


ఏమిటీ #మహాలయం?


ఈ సమస్త సృష్టికీ కారణం ఆ భగవంతుడు.

ఇహ, పర లోకాలలో మనం జీవితాలను ఏ విధంగా గడపాలి, ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే మార్గ దర్శకత్వం చేసినవారు పూర్వ ఋషులు.


అలాగే ఈ లోకం లోకి మనను ఆహ్వానించి, పెంచి, పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పించి, మనకు ఒక అస్తిత్వాన్ని ప్రసాదించినవారు తల్లితండ్రులు, మన ముందు తరాలవారు.


తన సృష్టిలో ఆయన మనల్ని భాగంగా చేసినందుకు దేవుడి ఋణాన్ని, విజ్ఞానప్రదాతలైన ఋషుల ఋణాన్ని, మన ఉనికికి కారకులైన మన పూర్వీకుల ఋణాన్ని తీర్చుకోవడం మానవులుగా మన ధర్మం.


వీటన్నిటికీ అనువైన మాసంగా భాద్రపదాన్ని నిర్దేశించారు పెద్దలు.


తొలి పూజ అందుకొనే దేవుడైన గణపతిని ఆరాధించే వినాయకచవితి, ఋషులను స్మరించుకొని ప్రార్థించే ఋషి పంచమి ఈ మాసం ప్రథమార్థంలో వస్తాయి.


ఇక, పూర్వీకులకు శ్రాద్ధకర్మలు నిర్వర్తించడానికి అనువైన పదిహేను రోజుల కాలాన్ని ద్వితీయార్థంలో నిర్దేశించారు. 


పితృకర్మలకు నిర్ణయిచిన భాద్రపద మాస కృష్ణపక్షాన్ని ‘మహాలయ పక్షం’ అనీ, ‘పితృపక్షం’ అనీ, ‘అపరపక్షం’ అని పిలుస్తారు.


అన్నాద్భవంతి భూతాని 

పర్జన్యాదన్న సంభవః 

యజ్ఞాద్భవతి పర్జన్యో 

యజ్ఞ కర్మ సముద్భవః 


అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలని గీతలో ఉంది.


మరణించిన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే మహాలయ పక్షాల ముఖ్యోద్దేశం.


మరణించిన ప్రాణి.. ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుందని మనశాస్త్రాలు చెబుతున్నాయి.


ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి భూమి మీదికి జీవాత్మగా రావాల్సి ఉంటుంది.


మరణించిన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే.. పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి.


అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అలా అందించే అధికారం వారి కడుపున పుట్టిన పుత్రులకే ఉంటుందని చెబుతోంది శాస్త్రం.

అప్పుడే వారి పితృరుణం తీరుతుంది.

ఆ రుణం తీరడమే మోక్షం. 


కాలం చేసిన వంశస్థులతో పాటు పుత్రులు లేని గురువులకు, స్నేహితులకు కూడా మహాలయ పక్షాల్లో తిలోదకాలతో పిండప్రదానం చేసే అర్హత, అధికారం కర్తకు ఉంటుంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు.


ఏ కారణంతోనైనా.. తద్దినం పెట్టకపోతే.. ఆ దోషం మహాలయ పక్షాల్లో పితృవిధి నిర్వర్తిస్తే తొలగి పోతుందంటారు.


ఈ పక్షాల్లో పితృదేవతలు ఆశతో తమ వారసుని ఇంటిని ఆవహించి ఉంటారని నమ్ముతారు.

పితృవిధి నిర్వర్తించిన వారసుడిని మనసారా ఆశీర్వదించి, పిల్లాపాపలతో సంతోషంగా జీవించమని దీవిస్తారట. 

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు