⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ ।

పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ ।

ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ ।

కపోల దానవారణం భజే పురాణ వారణమ్ ॥


💥గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యమూ తలపెట్టం. ఎందుకంటే, ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుతాయని శాస్త్రవచనం.


విఘ్ననిర్మూలనకు అవతరించి మంగళస్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు. గణపతి సర్వవిద్యాధి దేవతగా, వేదకాలం నుండి ఆరాధనలందుకుంటున్న దైవం.


వేదాలలో స్తుతించబడి, గణాలకు అధిపతియై, శబ్దాలకు రాజుగా, ప్రణవ స్వరూపుడై శబ్దబ్రహ్మగా నిలిచాడు.


‘గ’ శబ్దం బుద్ధికి ‘ణ’ శబ్దం జ్ఞానానికి ప్రతీక.

సమస్త మంత్రాలలోను శక్తికి కారణాలైన బీజాక్షరాలన్నింటి లోకి ముందుగా ఉచ్చరించేదే ‘ఓంకారం’ అందుచేత గణపతిని ఓంకార స్వరూపుడిగా ‘గణపత్యధర్వ శీర్షం’లో వర్ణించారు.


గణాలంటే అక్షరాలతో ఏర్పడే ఛందస్సు – గురువు, లఘువు, పూర్ణానుస్వార, అర్ధానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ‘గణపతి' 


అంతే కాకుండా ‘బ్రహ్మణస్పతి’ అంటే వేదాలకి నాయకుడివి అని కీర్తించారు. సృష్టి ఆదిలో దేవతా గణాల ప్రారంభం కంటే ముందే గణనాథుని తో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి.


సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది. ఇంకా మనుషులే పుట్టకముందు అన్నమాట. అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది. ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలసినవి. ఆ చూపుల కలయికకి విఘ్నేశ్వరుడు పుట్టాడు.


అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పంలోనూ పూజిస్తున్నాం. 


శరీరంలోని షట్చక్రాలలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రం ‘మూలాధార చక్రం‘. ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు.


దీనిలో ఇంకో రహస్యం కూడా ఉంది. ‘మహాశక్తి’ అయిన పార్వతీదేవికి ‘ద్వారపాలకుడుగా’ గణపతిని పెట్టినట్టు మన పురాణగాధ, దీనిలో అంతరార్థం ఏమిటంటే.. 


మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే మహాశక్తి –ఆ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి ప్రవేశించే ద్వారం వద్దనే గణపతి కావలిగా ఉన్నాడు. 


అంటే గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే శక్తిని మేల్కొల్పటం సాధ్యపడుతుంది.


మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి ‘ఇడ’,‘పింగళ’ నాడులద్వార షట్చక్రాలను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి ‘సిద్ధి‘ ‘బుద్ధి‘ కలుగుతుంది.


ఈ బుద్ధి, సిద్ధి ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు అని చెప్పబడినాయి.


💥తనను చేరిన భక్తులకు సకల శుభాలను చేకూర్చే వినాయకుడు తాను భక్తుల పాలిట కల్పతరువు అని సూచించకనే సూచిస్తూ ఉంటాడు!


ఆయన భంగిమలను కాస్త గమనిస్తే అవుననే అనిపిస్తుంది. చాలా ప్రతిమలలో వినాయకుడు తన ఎడమ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కిందకి ఉంచి కనిపిస్తాడు. దీనినే యోగశాస్త్రంలో "లలితాసనం" అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్రతిబింబమైన లలితాదేవి కూడా ఈ ఆసనంలోనే కనిపిస్తుంది.


ఒక పక్క ప్రశాంతంగా ఉంటూనే అవసరమైనప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే తత్వానికి ఈ ఆసనాన్ని ప్రతీకగా భావిస్తారు. కర్మయోగులకు ఈ రెండూ అవసరమే కదా! 


ఒక పక్క జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మనసుని స్థిరంగా నిలుపుకోగలడమే మానవులకి నిజమైన సవాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నానని గణేశుడు చెప్పకనే చెబుతున్నాడన్నమాట.


తనను కొలిచే భక్తుల విఘ్నాలను తొలగించి వారిని కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాడు. అందుకనే భక్తులు ఎక్కువగా లలితాసనంలో ఉన్న వినాయకునికే పూజలు చేస్తుంటారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు