"తాళ్లపాకవారి లాలి, తరిగొండవారి హారతి"
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి ।
"తాళ్లపాకవారి లాలి, తరిగొండవారి హారతి"
💥శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్త మార్గాన్ననుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. దీనినే ఆగమ పరిభాష లో "షట్కాలపూజ" అని అంటారు.
అవి... ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది.
సుప్రభాత సేవ:
నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది.
శుద్ధి:
సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడు గంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది.
తోమాలసేవ:
ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత రెండవ సారి మరల తోమాలసేవ చేస్తారు.
కొలువు:
తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు స్నపన మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. దీనినే శ్రీ వైఖానస భగవచ్చాస్త్రం లో 'యాత్రాసనం' అని కూడా అంటారు.
సహస్రనామార్చన:
ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి 1008 నామాలనూ స్తుతిస్తూ తులసి దళాలతో చేసే అర్చన.
మొదటిగంట, నైవేద్యం:
మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు.
అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
అష్టోత్తరశతనామార్చన:
ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణం లో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు.
రెండో గంట, నైవేద్యం:
అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట నైవేద్యం జరుగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.
రాత్రి కైంకర్యాలు:
ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది.
ఏకాంతసేవ:
రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు బ్రహ్మది దేవతలు వస్తారని ప్రతీతి.
బ్రహ్మది దేవతలు స్వామి వారి ఆరాధన చేయడం కోసం తగినంత నీటిని బంగారు పంచ పాత్రల లో ఉంచుతారు. వారు ఆరాధన చేసిన తీర్ధాన్ని మరుసటి రోజు సుప్రభాతం ముగిసిన తర్వాత భక్తులకు తీర్ధంగా ఇస్తారు.
ఏడుకొండలస్వామి పవళింపుసేవ లో అన్నమయ్య లాలి సంకీర్తనలు ఆలపిస్తారు. దీన్ని "తాళ్లపాక వారి లాలి" అంటారు. దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.
ముత్యాల హారతి:
ఉత్తర మాడ వీధి లో నివసించే తరిగొండ వెంగమాంబ అనే మహాభక్తురాలు హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందు నుండి కదలని రథానికి గుర్తుగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతిని ఇమ్మని భక్తులూ, అర్చకులూ అడిగేవారట.
కాలక్రమం లో అది ఒక సేవగా స్థిరపడిపోయింది. ఈ సేవనే "తరిగొండ ముత్యాల హారతి" అనేవారు. వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది. అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.
ఈమె సమర్పించే ముత్యాలహారతే చివరి హారతి.
అందుకే శ్రీవారి ఆలయంలో "తాళ్లపాకవారి లాలి, తరిగొండవారి హారతి" అన్న ప్రసిద్ధి ఏర్పడింది.
ఆ తరువాత దర్శనాలు, హారతులు ఉండవు. ఆ తరువాత శ్రీవారి ఆలయం బంగారువాకిళ్లు మూసివేస్తారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment