సమ్మక్క - సారలమ్మ అసలు కథ ఏంటి? కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


💥సమ్మక్క - సారలమ్మ అసలు కథ ఏంటి? కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?


మేడారం జాతర.. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వన దేవతలను దర్శించుకొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే, మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది?


ఇక్కడ వన దేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యం ఏమిటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు?


💥పూర్వం కోయదొరలు వేటకోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది.


ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్లి దాచారు. పాప గూడేనికి వచ్చినప్పటి నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు. 


మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు.


క్రీస్తు శకం 1260 నుంచి 1320 కాలంలో అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు.


ఇతను తన మేనల్లుడు, మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. సమ్మక్క-పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం కలిగారు.


మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఆ రోజుల్లో కరవు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు.


కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం, తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమర శంఖం పూరించాడు.


ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు.


💥మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు-కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది.


ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవింద రాజులు (సమ్మక్క-పగిడిద్దరాజు అల్లుడు) వీరోచితంగా పోరాటం చేశారు.


కానీ, కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణించారు.


వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి సంపెంగవాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతారు.


💥తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. వీరోచితంగా పోరాటం సాగిస్తుంది. 


ఆమె వీరత్వం చూసి ప్రతాప రుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ, ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు.


ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతారు.


ఆ తర్వాత చెట్టుకింద ఓ పుట్ట దగ్గర ఓ కుంకుమభరిణ కనిపించిందట. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు.


కొంత కాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దుచేసి, సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు.


రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలయ్యిందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. 


💥కుంకుమ భరిణెనే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క-సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకొనే సాంప్రదాయం ఏర్పడింది.


ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. 


ఈ దట్టమైన అడవులు, కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. నాలుగు రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వన ప్రవేశం చేస్తారు. దీంతో మహా జాతర ముగుస్తుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం