💥మాఘ శుక్ల పంచమి.. వసంతపంచమి.. శ్రీ పంచమి.

 ⚜️🕉️🚩ఓం శ్రీ సరస్వత్యై నమః🌹🙏


సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌

కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌ !

వహ్ని శుద్దాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌

రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌ !!


💥మాఘ శుక్ల పంచమి.. వసంతపంచమి.. శ్రీ పంచమి.


సకల విద్యా స్వరూపిణి పరాశక్తి సరస్వతిగా ఆవిర్భవించిన తిథి.


"యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా’’ అంటూ దేవీ భాగవతం ప్రస్తుతించింది.


మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ

పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః॥


మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం.


ఈ రోజునే క్షీరసాగర మథన సందర్భంగా మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా "#శ్రీపంచమి"గా పేర్కొనడంతో, ఈ రోజు మహాగణపతిని, శ్రీలక్ష్మిని, శ్రీ సరస్వతిని షోడశోపచారాలతో పూజించాలి.


శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను, లేఖినులను పూజాపీఠంపై ఉంచి అర్చించాలి. 


సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||


శ్రీ సరస్వతీదేవిని తెల్లని పూలతో, సుగంధ ద్రవ్యాలతో, చందనంతో, అర్చించి తెల్లనివస్త్రాన్ని సమర్పించాలి. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తే, ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం.


బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృప వల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడంటారు.


గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవిదొకటి. యాజ్ఞవల్క్యుడు గురు శాపం వలన విద్యలను కోల్పోవడంతో సూర్యుని ఆరాధించగా ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహా విద్వాంసుడయ్యాడు. 


వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేశాడని పురాణాలు చెబుతున్నాయి.


అలాగే వ్యాస మునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే వేద విభజన చేసి  పురాణాలను ఆవిష్కరించాడని.. మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూల పురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి.


తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక, ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.


విద్యలకు అధిష్ఠాత్రి సరస్వతి. ఆమె అనుగ్రహం వలన ఉలుకూ, పలుకూ, బుద్ధి, శక్తి లభిస్తాయి. మతి మరుపు, మాంద్యం తొలగుతాయి.


మేథాశక్తి పెంపొంది, సరియైన జ్ఞానం కలిగి ఇహమూ, పరమూ, మోక్షమూ లభిస్తాయి. జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతి.


శృతులలో సరస్వతీ దేవిని ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది. 


శ్రీ శంకర భగవత్పాదులు శారదాదేవి కృపచేతనే అపారమైన వేద వాఙ్మయాన్ని పొంది, భారతీయ సనాతన ధర్మ వ్యవస్థను పునఃప్రతిష్ఠించినట్లు విజ్ఞులు చెబుతారు.


శారదామాత పట్ల తన శరణాగతికి ప్రతీకగా శృంగేరీ క్షేత్రంలో ఆ తల్లిని ప్రతిష్ఠించారు. మనందరికీ మార్గనిర్దేశం చేశారు.


💥సరస్వతీ దేవిని తెల్లని పూలతో పూజించాలి. పాలతో చేసిన క్షీరాన్నం నివేదన చేయాలి.


"ఓం సరస్వత్యై నమః" అనే మంత్రాన్ని జపించాలి. పుస్తకాలు, పెన్నులు యందు సరస్వతీ దేవిని ఆవాహన చేసి పూజించాలి.


మాటను అదుపులో పెట్టుకోవాలి. ఎవరిని దూషించరాదు. ఇతరుల గురించి చెడుగా మట్లాడరాదు. ఎందుకంటే వాక్కు కూడా సరస్వతీ కటాక్షమే.

అమ్మ అనుగ్రహం కలిగేతే ఎంతటి వారికైనా అఖండ విద్యాప్రాప్తి లభిస్తుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు