💥క్షీరసాగరమధనం.. లక్ష్మీదేవి ఆవిర్భావం
⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం!!
💥లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.
1) స్వాయంభువ మన్వంతరంలో - భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం.
2) సార్వోచిష మన్వంతరంలో - అగ్ని నుండి అవతరణ.
3) జౌత్తమ మన్వంతరంలో - జలరాశి నుండీ,
4) తామస మన్వంతరంలో - భూమి నుండీ,
5) రైవత మన్వంతరంలో - బిల్వవృక్షం నుండీ,
6) చాక్షుష మన్వంతరంలో - సహస్రదళ పద్మం నుండీ,
7)వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది.
💥పూర్వం ఒకసారి దూర్వాస మహా ముని కల్పవృక్ష మాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కిందపడేసి, కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది.
అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై "నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక" అని శపిస్తాడు. శాపఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది.
రాక్షసులు స్వర్గం పైకి దండయాత్రలు చేస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు.
దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణువేడతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటపెట్టుకుని విష్ణువువద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు.
క్షీరసాగర మధనం ద్వారా అమృతాన్ని ఉద్భవింపచేసి, ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు.
దేవతలకొక్కరికి క్షీరసాగరాన్ని మధించడం సాధ్యము కాదు కనుక రాక్షసుల సహాయాని తీసుకొని అందుకు సిద్ధమయ్యారు.
💥క్షీరసాగరమధనం:
మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకొని చిలుకుతుండగా, మందరగిరి పట్టుతప్పి మునిగిపోతున్న తరుణంలో శ్రీకూర్మమై తన మూపుపై పర్వతాన్ని నిలుపుకొని, ఇక క్షీరసాగరమధనం కొనసాగించమని ఆనతిచ్చిన ఆర్తత్రాణపరాయణుడు "శ్రీ మహావిష్ణువు".
క్షీరసాగర మధనం జరిగినప్పుడు - ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని లోకశ్రేయస్సుకై 'శివుడు' స్వీకరించి 'నీలకంఠుడు' కాగా, లోకకల్యాణం కోసం, భర్తకు విషం మింగమన్న పార్వతీదేవి 'సర్వమంగళ' గా ప్రసిద్ధి పొందారు.
ఆ తర్వాత మరల కొనసాగిన సముద్ర మధనంలో 'సురభి' అనే కామదేనువు జనించగా ఋషులు యజ్ఞకర్మల నిమిత్తం దీనిని స్వీకరించారు.
తర్వాత 'ఉఛ్వైశ్రవం' అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలి స్వీకరించాడు.
ఆ పిమ్మట ఐరావతం, కల్పవృక్షం మొదలగునవి జనించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు.
అనంతరం క్షీరాబ్ధి నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది.
ఈ శుభదినం లక్ష్మీదేవి ప్రాదుర్భవంతో పాటు పరిణయం కూడా జరిగిన దినం.
లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వడా అని అందర్నీ చూస్తూ, సకలసద్గుణవంతుడు, అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణ పరాయణుడు విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును కాంచి, పుష్పమాలను విష్ణువు మెడలో వేసి, వరించింది.
లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది.
లక్ష్మి అనుగ్రహమంటే సిరిసంపదలే కాదు, ఆమె అనుగ్రహం ప్రధానంగా ఎనిమిదిరకాలుగా ఉంటుంది. అవి - ధనం, ధాన్యం, గృహం, సంతానం, సౌభాగ్యం, ధైర్యం, విజయం, మోక్షం!
శుచి శుభ్రతలను పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహం పొందగలం.
తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతోనే సిరిసంపదలతో పాటు కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, స్మృతి, బలం, మేధా, శ్రద్ధ, ఆరోగ్యం, జయం ఇత్యాదివి లభిస్తాయి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment