ఓం లక్ష్మి నృసింహాయ నమః

 ⚜️🕉️🚩 ఓం లక్ష్మి నృసింహాయ నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత

దురితజాలము లన్ని - దోలవచ్చు


నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత

బలువైన రోగముల్ - పాపవచ్చు


నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత

రిపుసంఘముల సంహ - రింపవచ్చు


నరసింహ । నీ దివ్య - నామమంత్రముచేత

దండహస్తుని బంట్ల - దరమవచ్చు


💥అన్ని అవతారాలకు భిన్నం "#నరసింహ_తత్వం"


భగవంతుని మిగిలిన అవతారాలలో లాగా కాకుండా,

సగం మనిషి, సగం మృగం ఆకారంలో రూపు దాల్చడం నరసింహావతార ప్రత్యేకం.


"దుష్ట శిక్షణ శిష్ట రక్షణ" "సర్వాంతర్యామిత్వం" "భక్తుని మాటను నిజం చేయడం" "నమ్మిన బంటు శాప విముక్తి గావించడం", ఎన్ని నియంత్రణలు వరాలు ఉన్నా శత్రు వధ చేయడం, సూక్ష్మము నుండి, స్థూల రూపాన్ని ఏదైనా ధరించడం, విష్ణుమూర్తి పదవ ఆవతారాలలో నాలుగవ దైన.. నరసింహావతారంలో విశిష్టతలు. 


"వృషభే  స్వాతి నక్ష త్రే, చతుర్దశ్యాం శుభదినే,

సంధ్యా కాలే నిషాయుక్తే,  స్థంభో ధ్భూతం నృకేసరి"


వైశాఖ శుక్ల పక్ష చతుర్దశి స్వాతి నక్షత్ర ప్రదోషకాలంలో నరసింహుడు అవతరించాడు.


💥తన ఘోర తపస్సుచే  బ్రహ్మను మెప్పించిన హిరణ్యకశిపుడు, తనకు నరులచే గాని, మృగాల చేతిలో గాని, పగలు గాని, రాత్రి గాని, ప్రాణమున్న వానిచే  గాని, ప్రాణం లేని వానిచే గాని, ఆయుధము చేతగాని, గాలిలో గాని, నీటిలోగాని, అగ్ని యందు గాని, ఆకాశంలో గాని, భువిపైన గాని, దేవ దానవుల చేగాని, ఇంట గాని, బయటగాని, మరణం లేకుండా వరాలు కోరి పొందాడు. 


వరగర్వ మధాందుడై, విష్ణు ద్వేషియై, దేవతలను జయించి, ఇంద్ర సింహాసనం ఆక్రమించి, తాపసులను భంగపరిచి, సాధువులను హింసించి, పంచభూతాలను శాసించాడు.


పుట్టిన బిడ్డకు ,”ప్రహ్లాదుడు” అని నామకరణం చేశాడు. విష్ణుభక్తుడైన కుమారుని మార్చడానికి శతవిధాల ప్రయత్నించాడు.


"చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్, చదువగ వలయును జనులకు, చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ”


-అంటూ రాక్షస కుల గురువైన చండామార్కులకు, కుమారుని అప్పగించాడు.


హిరణ్యకశిపుడు "గురుకులంలో ఏమి నేర్చుకున్నావూ" అని ప్రశ్నిస్తే ప్రహ్లాదుడు “సర్వమూ అతని దివ్య కళా మయం అని తలంచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయుట మేలు” అని బదులిచ్చాడు. 


రాక్షసులకు తగని ఇలాంటి బుద్ధి, నీకు ఎలా పుట్టిందంటే, “మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు,” అంటూ వైష్ణవ భక్తి సహజంగానే లభించింది అన్నాడు.


మళ్లీ గురుకులానికి పంపబడి, మనసు మారిందేమోనని, గురువు లేమి చెప్పారని ప్రశ్నిస్తే, “చదివించిరి నను గురువులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ” అని వివరించాడు.


"నవ విధ భక్తి మార్గముల హరిని నమ్మి యుండుట భద్రము” అన్నాడు.


విసిగిపోయి “విష్ణు ఎక్కడ ఉన్నాడురా” అని హిరణ్యకశిపుడు ప్రశ్నించాడు.


"కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్”... వెదుకంగా నేల ఈ యా ఎడన్”, 


“ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే” అంటూ ప్రహ్లాదుడు బదులిచ్చాడు. 


అయితే “స్తంభమునన్ చూప గలవె చక్రిన్ గిక్రిన్” అని అని ప్రశ్నించగా, “కనబడు ప్రత్యక్ష స్వరూపంబునన్”, అన్నాడా పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు.


వెంటనే హిరణ్య కశిపుడు స్థంభాన్ని  చరవగా,  శ్రీ నృసింహుడు ఆవిర్భవించి, హిరణ్యకశిపుని ఒడిసిపట్టి, వజ్రాల వంటి ప్రాణం ఉన్నవి లేనివి అయిన, తన నఖాలతో (గోళ్ళతో) చీల్చి..

శ్రీహరి మనిషి జంతువు కాని నరసింహ రూపంలో, పగలు రాత్రి గాని సంధ్యా సమయాన, ఇంట బయట గాని  గుమ్మంలో,  భూమ్యాకాశాలు కానీ తన తొడపై సంహరించాడు. 


ప్రహ్లాదుని మాట యధార్థం చేసి బ్రహ్మ వరాన్ని గౌరవించి, తన అవతార తత్వాన్ని చాటాడు శ్రీమహావిష్ణువు.


💥ఉగ్రం వీరం మహా విష్ణుం, జ్వలంతో సర్వతో ముఖం, నృసింహం భీషణం భద్రం, మృత్యు మృత్యు నమామ్యహం”

-అనే మంత్రంతో నరసింహుని పూజిస్తే, శత్రు భయం ఉండదని, జయం కలుగుతుందని పురాణాలు చెపుతున్నాయి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు