💥నారదుడికి ముగురమ్మల మంత్రం... ఓం శ్రీ సతియే నమః

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥నారదుడికి ముగురమ్మల మంత్రం... ఓం శ్రీ సతియే నమః


ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు. 


అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది.


ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు.


వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది.

నారదుడు కూడా వీరిని చూశాడు.


ఇంకేం.. కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికిందనుకున్నాడు.


త్రిమూర్తుల భార్యలంతా ఒకేచోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు.

కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి.. వారి మధ్య కలహాన్ని రేపి, తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు.


అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి "ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు. ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి'' అని నిర్ణయించుకుని బ్రహ్మ మానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు.


ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను నమస్కరించాడు.

ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి, విషయాలేంటని అడిగారు.


ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు.

త్రిమూర్తులైన భార్యలైన మీరు ముగ్గురూ, సకలలోక వాసులచే స్తుతింపబడుతున్నారు.

అంతవరకు బాగానే ఉంది.. కానీ మీ ముగ్గురిలో ఎవరుగొప్ప? అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని అన్నాడు. 


నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు.. నారదా నీ సందేహం ధర్మసమ్మతమే.


నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి.. అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు.

కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు.


🌹ముందు సరస్వతీ దేవి నారదునితో.. నారదా! భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి, అక్కడున్న ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి, సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో "ఓం శ్రీ సతియే నమః'' అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్ఛరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది. 


మంత్రోచ్ఛరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీ దేవి అంటుంది.


ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్లి సెల్వనాథుడి గురువును కలిశాడు.


సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు.. సెల్వ నాథుడికి అక్షరం ముక్క రాదు...

వాడితో నా ప్రాణం విసిగిపోయింది.

పశువులను మేపాల్సిందిగా పంపేశాను.. వెళ్ళి చూడమంటాడు.


నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని.. తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు.


నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు.

ఇలా సముద్రంలో స్నానం చేసి.. శుచియై వచ్చిన ఆ బాలుడికి ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయమని చెప్తాడు. 


ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు.

అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు.


🌹పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారదా.. కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు.

అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ''ఓం శ్రీసతియే నమః'' మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. 


ఇలా పెరినాయకి ఇంటికి వెళ్లిన నారదుడు.. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు.

సంతానం లేకపోవడంతో తన భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు.

 

ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు.

ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయింది.

ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు.


🌹ఇక మూడో సారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడిని కలవమంటోంది.

''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది.


అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్లి.. దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు. రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా, రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది. దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. 


ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించి 108సార్లు జపించమని చెప్తాడు.

ఆ తర్వాత ఆ పేద పండితులు శ్రీమంతుడిగా మారిపోతాడు.

ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ.. ముగ్గురమ్మలను దర్శించుకుంటాడు.


అమ్మలారా! మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను.

ఇప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టిందని అడుగుతాడు.


అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది. బ్రహ్మదేవ పుత్రా.. మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు.

జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం, సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తుంటాయి.


శ్రీ లక్ష్మి లోని ''శ్రీ'' అనే అక్షరాన్ని, సరస్వతిలోని ''స'' అనే అక్షరాన్ని, పార్వతీదేవి లోని 'తి' అనే అక్షరాన్ని బీజాక్షరాలుగా జత చేసి ''ఓం శ్రీసతియే నమః'' అనే మంత్ర సృష్టికి కారణం నువ్వే అయ్యావన్నారు.


ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది. అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు