కృష్ణం వందే జగద్గురుమ్🌹🌹🙏

 ⚜️🕉️🚩ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః🌹🙏


💥కృష్ణంవందేజగద్గురుమ్..! 💥


రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ |

అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ || 

🍁🍁🍁🍁🍁


🌹నెమలిపింఛం, నీలవర్ణం, నల్లని గొల్లవాడు పిల్లనగ్రోవితో భాగవతంలో వెన్నదొంగగా దర్శనమిచ్చే నీలమేఘశ్యాముడు...

మహాభారతంలో నగర రాజ్యాల నిర్మాతగా, యుద్ధవీరుడిగా, తాత్వికుడిగా, రాజనీతిజ్ఞుడిగా  అరివీర భయంకర యుద్ధానికి దార్శనిక సమాధానమిచ్చే వ్యూహకర్తగా ప్రత్యక్షమవుతాడు.


మహాభారత యుద్ధ మైదానంలో అర్జునుడి నైతిక సంశయాన్ని పటా పంచలు చేసే చింతనాపరుడిగా రూపుగడతాడు.


"నల్లనివాడు పద్మనయనంబులవాడు"

అంటూ శ్రీకృష్ణుడి రూపాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు పోతనామాత్యుడు. 


'కృష్‌’ అంటే దున్నడమనే అర్థం ఉంది.

భూమిని దున్నడానికి ఉపయోగించే నాగలి కర్రు మొన నల్లగా ఉంటుంది.

అందుకే ‘కృష్ణ’ అనే శబ్దానికి ‘నలుపు’ అనే అర్థం ఏర్పడింది.


శ్రీకృష్ణుడిని కేవలం ఒక "సాహిత్య పాత్ర"గా భావిస్తే ఆ పాత్ర విశ్వసాహిత్య జగత్తులో నిరుపమాన సృష్టి.


ఒక చారిత్రక వ్యక్తి అనుకుంటే, ఆ వ్యక్తి ప్రపంచ చరిత్రలో "నభూతో న భవిష్యతి"


"లీలామానుష వేషధారి" అని తలస్తే అవాఙ్మనసగోచరం అని వేదాంతులు చెప్పిందే ఖచ్చితంగా నమ్మి తీరాలి.


వజ్ర వ్యూహంతో మొదలై త్రిశూల వ్యూహంతో ముగిసిన మహాభారత యుద్ధానికి తాత్విక సమర్థన చెప్పి, దారి చూపింది కూడా జగన్నాటక సూత్రధారే! 


"మౌనం" కూడా ఆయుధమనీ, "మాట" శరమనీ, "సందర్భం" విచ్చుకత్తుల బోను అనీ హెచ్చరించినవాడు శ్రీకృష్ణపరమాత్ముడు.


ఆలోచన స్తంభించినపుడు "ఆయుధం" అక్కరకు రాదనే ఎరుక కలిగించినవాడు జనార్దనుడు.


ధర్మగ్లాని సంభవించినప్పుడు దుష్ణశిక్షణ శిష్టరక్షణ కోసం భగవంతుడు ఎత్తే అవతారాలను లీలావతారాలంటారు.


భాగవత కథనం ప్రకారం నారాయణుడి లీలావతారాలు ఇరవైరెండు.

వాటిలో శ్రీకృష్ణావతారం ఇరవయ్యవది.


మధురలో బాలకృష్ణుడిగా, పూరీలో జగన్నాథునిగా,  పండరీపూర్ లో విఠోబాగా, తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిగా, ఉడిపిలో శ్రీకృష్ణుడిగా, గురువాయూరులో గురువాయూరప్పగా శ్రీకృష్ణుని ఆరాధిస్తారు.


మహాభారత యుద్ధంలోని అనివార్యత, అమానవీయత, తప్పని రక్తతర్పణ, బంధాల విచ్ఛిన్నం అన్నింటి గురించి అర్థవంతమైన నైతిక సూత్రాలు చెప్పినవాడు శ్రీకృష్ణుడు. 


మౌనాన్ని అర్థం చేసుకోగల శక్తి అందరికీ ఉండదు.

మౌనమే ఆధ్యాత్మిక భాష అని చెప్పింది శ్రీకృష్ణుడే!


"మౌనం" అంటే మాట్లాడకపోవడం కాదు.

మనసును శూన్యం చేసుకోవడం.

ఆలోచనలకు అవకాశం ఇవ్వకపోవడం.

మౌనం చాలా సమస్యలను పరిష్కరిస్తుంది.

ఈ కఠోర వాస్తవాన్ని శ్రీకృష్ణుడు తన జీవితంలో పాటించి, ఇతరులకు చెప్పకనే చెప్పాడు.


పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే


సజ్జనులను రక్షించి, దుర్జనులను శిక్షించి ధర్మసంస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే  ఉంటానని లోకానికి భరోసా ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.


కురుక్షేత్రంలో మోహరించిన సేనలను చూసి, విచలితుడైన అర్జునుడు ధనుర్బాణాలు విడిచి,  చేష్టలుడిగి కూలబడిపోతే, తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ‘గీత’బోధ చేసినవాడు.


'గీత'బోధ కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, సమస్త లోకానికీ ఉద్దేశించిన కర్తవ్యబోధ!

అందుకే శ్రీకృష్ణుడు గీతాచార్యుడిగా, జగద్గురువుగా పూజలందుకుంటున్నాడు.

🌷🌷కృష్ణం వందే జగద్గరుమ్..!🌷🌷

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు