💥కూర్మావతార సందేశం💥
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
💥"భాగవతం" వైభవం క్రింది శ్లోకంలో చెప్పబడింది.
‘భా’ శబ్దో కీర్తివచనో
‘గ’ శబ్దో జ్ఞాన వాచకః।
సర్వేష్ట వచనో ‘వశ్చ’
‘తో విస్తారస్య వాచకః।
ధర్మార్థకామమోక్షాంశ్చ
ముక్తి వర్ణ చతుష్టయీ।
ప్రాప్యంతే యతో-నేన
తస్మాద్భాగవతం స్మృతమ్॥
💥మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః।
రామోరామశ్చ శ్రీ రామశ్చ కృష్ణః కల్కిరేవచ॥
- అని పేర్కొనబడినవే దశావతారాలు.
ఈ అవతారాల చరిత్రను తెలియజేసేదే శ్రీ మహా భాగవతం.
🍁🍁🍁🍁🍁
వేదము లుద్ధరించి, గిరి వీపున మోసి, ధరన్ ధరించి, ప్ర
హ్లాదునిగాచి, నొంచిబలి, హైహయవంశజులన్ వధించి,వి
చ్ఛేదమొనర్చి రావణుని, చే హరిమూని,కృపాబ్ధినించి,మ్లే
చ్చాదుల మూర్ఛ ముంచియు దశాకృతి బొల్చిన కృష్ణు మ్రొక్కెదన్.
💥#కూర్మావతారం💥🐢
💥అమృతప్రాప్తికై సురాసురులందరూ కలిసి క్షీరసాగరం సమీపించినారు.
సాగరమథనం సామాన్యమా?
మంధరాన్ని కవ్వంగా చేసికొన్నారు.
వాసుకి సర్పాన్ని ఆ పర్వతానికి చుట్టినారు.
తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు పట్టుకొన్నారు.
అయితే సముద్రం లోపల మునిగి పోతున్న మంధర పర్వతాన్ని చూచి...
వనజాక్షుడు ఆ వార్థి నడుమ లక్ష యోజనాల పర్యంతమైన కర్పరంతో బ్రహ్మాండాన్నైనా మ్రింగివేయగల మఖగహ్వరంతో,
సకల చరాచర జంతురాసుల మ్రింగి లోపలకు తీసుకోగల్గిన పెద్ద కడుపుతో,
విశ్వం మీద మరో విశ్వం పడినా కదలని పటిష్టమైన పాదాలతో, బయటికి లోపలికి వెళ్ళగలిగిన తొండంతో, అంబుజాక్షాలతో ఒక మహా కమఠం🐢అయినాడు.
ఆ అద్రిని వీపున మోస్తూ తరి కడవకు కుదురు వలె క్షీరసాగర మథనానికి తోడ్పడినాడు.
💥కూర్మావతార సందేశం💥
క్షీరసాగరం వలె ఆకర్షణీయమై మానవుని భ్రమింపజేస్తుంది సంసారం.
అందులోని సారమెంత? ఏమిటి?
అని విచారించి చూస్తే సంసారంలో సారం ఏమీలేదు.
అందుకే మంధరమనే నిశ్చయాత్మకమైన బుద్ధితో,
క్షీరమనే సంశయాత్మకమైన మనస్సును,
సద్వివేకమనే విచారణ రూపంగా మథనంచేయాలి.
ఇదే సాధన.
కాని నిరాలంబమైన సాధన కొనసాగుతుందా? అసాధ్యం. మనస్సు మాయలాడి.
బుద్ధిని ముంచి సాధకుణ్ణి వశపరచుకొని పశు ప్రాయుణ్ణి చేస్తుంది.
అందుకే సాధనా ప్రారంభదశలో మనస్సుకు ఆలంబనగా నామ, రూప విశిష్టమైన భగవదవతారమైన మంత్రాన్ని గురుముఖంగా అందుకోవాలి.
మనస్సులో నామాన్ని ప్రతిష్టించుకుంటే..
పవిత్రమైన పరమాత్మ యొక్క ఉనికి ఏర్పడి అమృతత్వ సాధనకు (మోక్షానికి) ఊత మౌతుంది.
ఆరంభ దశలో సాధకునికి కలిగే విఘ్నాలు హాలాహల తుల్యాలు.
పట్టు వదలక సాధన కొనసాగిస్తే సాధకుణ్ణి ప్రలోభ పెట్టడానికి క్షీరసాగరంలో ఐరావతాదులు పుట్టినట్లే వశీకరణాది శక్తులు అలవడుతాయి. అమిత సంపదలు కలుగుతాయి.
వీటికి లోనైనవాని జీవితం తమోమయం అవుతుంది.
కాబట్టి వీటిని కృష్ణార్పణం చేయాలి.
చివరకు మిగిలేది అమృతం.
అసురీ ప్రకృతిగల వారికి అమృత ప్రాప్తి లేదు.
వారు సాధన చేసినా మోహ రూపమైన కామాది అరిషడ్వర్గాల ఆకర్షణకు లోనవుతూ ఉంటారు.
మనస్సులో మంథనమనే ధ్యానం కొనసాగునప్పుడు అది నిరాధారంగా ఉండడం చేత, మంధర పర్వతం అనే బుద్ధి, జలమనెడి భ్రాంతిలో మునిగిపోతూ ఉంటుంది.
అట్టి దారుణ పరిస్థితుల్లో శ్రీహరిని ఆశ్రయిస్తే,
ఆయన కూర్మ రూపధారియై (భగవన్నామ మనెడి ఆధారం ద్వారా)..
మంథర పర్వతాన్ని (బుద్ధిని)..
సాగరం (సంసారం) లో మునిగిపోకుండా కాపాడుతాడు అని ఈ అవతారం సందేశమిస్తున్నది.
సేకరణ... "భాగవత సౌరభము" నుండి💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment