ఓం గం గణపతయే నమః మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం.

 🕉️🔱🚩 ఓం గం గణపతయే నమః🙏


🌹ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. 


🌹అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. 


🌹దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. 

శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు. 

నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు,

ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు,

అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.


🌹పరమేశ్వరుడు సర్వాంతర్యామి.

ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. 

కుబేరుడి అహాన్ని పసిగట్టాడు. 

పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది. 


🌹కుబేరుడు వచ్చి, మహాదేవా మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. 

శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీ దేవి. 


🌹ఇంతలో వినాయకుడు వచ్చాడు. 

వస్తూనే "అమ్మా ఆకలేస్తోంది. ఏదైనా ఉంటే పెట్టు" అన్నాడు గణపతి. 


🌹పార్వతీదేవి "కుబేరా మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు" అనగా, శివుడు "ఔను, గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం. 

మా బదులుగా గణపతిని తీసుకెళ్లు" అన్నాడు పరమశివుడు.


🌹హా ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకొచ్చేది. 

ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిలో ఉన్న తన భవనంలోనికి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు. 


🌹ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.


🌹వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధాలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించారు. 


🌹కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, 

ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. 


🌹సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. 

అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. 

ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.


🌹వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పనైపోయింది. 

కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. 

విషయం కుబేరుని తెలిసింది. 


🌹తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు.

ఏమి చేయాలో అర్ధంకాలేదు. 

ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. 


🌹కుబేరుడికి విషయం అర్ధమైంది. 

తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని...

అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని...

తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.


🌹శివా శంకరా నీవే దిక్కు🙏

ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. 

అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, 

"అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని" నిరూపించాడు. 


🌹మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను.

ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. 

అప్పుడు శివుడు "కుబేరా నీవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. 

అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. 

గణపతికి కావల్సినది #భక్తి మాత్రమే. 

నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం.

నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు. 

ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పు ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.


🌹కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. 

ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. 

గణపతి సంతృప్తి చెందాడు.


🌹మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. 

కుబేరుడి అహంకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని  అహంకారాన్ని కూడా పటాపంచలు చేయుగాక 🙏

(సేకరణ)

                          🌺🕉️🔱🕉️🌺🕉️🔱🕉️🌺



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం