ఓం సాయి రామ్ సాయి బాబా దినచర్య
ఓం సాయి రామ్🙏
సాయి బాబా దినచర్య
సాయిబాబా సాధు జీవితం ఎంతో పరిశుద్ధమైనది.
అందులోని పవిత్రతే ఎందరో భక్తులను ఎక్కడెక్కడి నుంచో షిరిడీకి లాక్కొచ్చేది.
బాబా దినచర్యను గమనించినవారికి ఆయన జీవితం ఎంత పవిత్రమైనదో తేలికగా అర్థమవుతుంది.
బాబా తెల్లవారు జామునే నిద్రలేచేవారు.
ధుని దగ్గర స్తంభానికి ఆనుకుని కొంతసేపు నిశ్చలంగా ధ్యాన నిమగ్నులయ్యేవారు.
తర్వాత అక్కడే నిల్చుని విచిత్రమైన భంగిమలను ప్రదర్శించేవారు.
నెమ్మదిగా 'యాదేహక్' (దైవాన్ని ఎప్పుడూ స్మరించాలి) వంటీ అరబ్బీ పదాలు పలికేవారు.
ఆ సమయంలో తమ వద్దకు ఎవరినీ రానిచ్చేవారు కారు.
ఆ లోగా మాధవ్ ఫస్లే అనే సేవకుడు మసీదును చక్కగా ఊడ్చి, బకెట్లతో నీటిని సిద్ధం చేసేవాడు.
సాయి ఆ నీటిని నోట్లోకి తీసుకుని పుక్కిలించి, ముఖం, కాళ్లు చేతుల్ని ఎంతో నాజుకుగా కడుక్కునేవారు.
తర్వాత కొంతసేపు కన్నులు అరమోడ్చి మౌనంగా కూర్చునేవారు.
మధ్యలో ధునిలోని కట్టెల్ని సవరిస్తూ, భక్తులతో ఆ ముందటి రాత్రి తామెక్కడికి వెళ్లిందీ, ఎవరినెలా కాపాడిందీ, మరణించిన వారి ఆత్మలను పైలోకాలకు తానెలా తీసుకెళ్లిందీ వివరించేవారు.
ఆ సమయంలోనే వేర్వేరు భక్తులకు కలిగిన అనుభవాలను అక్కడ కలబోసుకునేవారు.
అనంతరం కుష్ఠురోగ భక్తుడు భాగోజీ షిండే బాబా చేతి(ఆ చేతిని ధునిలో పెట్టే బాబా ఎక్కడో దూరంగా ఉన్న ఒక కుమ్మరి బిడ్డను కాపాడారు.
అప్పుడు ఆ చేతికి కాలిన గాయమైంది)కి శ్రద్ధగా కట్టు కట్టేవాడు.
నిజానికి బాబాకు అతని సేవతో పని లేకపోయినా అతన్ని ఆనందపరిచేందుకే ఆ అవకాశం ఇచ్చేవారు.
అప్పటికి ఉదయం ఏడున్నర అయ్యేది.
షిరిడీకి వచ్చిన మొదటి రోజుల్లో బాబా మూడు నాలుగు రోజులకు ఒకసారి ఈ సమయంలోనే బావి వద్దకు వెళ్లి కాళ్లు, చేతులు కడుక్కుని నీరు పుక్కిలించి ఉమ్మేవారు.
తర్వాత కొంత కాలానికి భక్తులు బాబా కోసం రెండు పెద్ద రాగి పాత్రలలో వేడి నీళ్లు, రెండు బిందెల చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు.
బాబా వేడి, చన్నీళ్లు కలుపుకుని సుమారు గంటసేపు స్నానం చేసేవారు.
ఉదయం తొమ్మిది గంటల సమయంలో బాబా భుజానికి నాలుగు మడతలు వేసిన గుడ్డను జోలెగా కట్టుకుని కుడిచేతిలో రేకు డబ్బా పట్టుకుని షిరిడీలోనిఅయిదిళ్లకు భిక్షకు వెళ్లేవారు.
భిక్ష తీసుకుని తిరిగి మసీదుకు చేరిన వెంటనే ఒక రొట్టె, కొద్దిగా అన్నం ధునికి ఆహుతిగా వేసేవారు.
ఆ తరువాత మిగిలినవన్నీ ఒక మట్టి పాత్రలో వేసి మూత పెట్టకుండా ఉంచేవారు.
ఎవరికి కావాల్సినవి వారు అందులోంచి తీసుకెళ్లేవారు.
కుక్కలు, పిల్లులు, బిచ్చగాళ్లు,సేవకులు ఎవరెంత తీసుకున్నా బాబా ఏమీ అనేవారు కారు.
అందరూ తీసుకోగా మిగిలిన పదార్థాలన్నిటినీ కలుపుకుని బాబా తినేవారు.
పగలెన్నడూ వెన్ను వాల్చేవారు కారు.
గోడకు జానెడు దూరంలో కూర్చునేవారు.
పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పుక్కిలించే వారు. భిక్షాన్నం మాత్రమే తినేవారు.
భిక్షకు వెళ్లి వచ్చిన తరువాత బాబా పాదరక్షలు ధరించి లెండీ వనానికి బయలుదేరేవారు.
భక్తులు దారి పొడవునా బాబాకు గొడుగు పట్టేవారు.
తిరిగి పదిన్నర ప్రాంతంలో బాబా మసీదుకు చేరుకునేవారు.
గాయకులు, నర్తకీ నర్తకులు, గారడీ వాళ్లు... ఇలా ఎవరో ఒకరు కొద్దిసేపు బాబా ఎదుట తమ కళలను ప్రదర్శించేవారు.
అటువంటి ప్రదర్శనలు లేకపోతే బాబానే మధ్యాహ్నం వరకు భక్తులకు హితోపదేశాలు, నీతి బోధకమైన కథలు చెబుతూ కాలక్షేపం చేసేవారు.
అనంతరం భక్తులందరితో కలిసి బాబా మధ్యాహ్న భోజనం చేసేవారు.
భోజనాలయ్యాక సగుణమేరు నాయక్ మసీదును శుభ్రం చేసేవాడు.
సాయి యథాస్థానంలో కూర్చున్నాక తాంబూలం, తర్వాత గ్లాసెడు మంచినీళ్లు, రెండు రూపాయల దక్షిణ ఇచ్చేవాడు.
కొంతసేపు సాయి ఏకాంతంగా గడిపేవారు.
సాయంత్రం అయిదు గంటల సమయంలో బాబా మళ్లీ లెండీ వనానికి వెళ్లి వచ్చేవారు.
అప్పుడు పిలాజీ గురవ్ మసీదు ఎదుట సన్నాయి వాయించేవాడు.
ఎందుకో బాబా అతనిపై ఆవేశంగా ఎగిరిపడేవారు.
తరువాత కొద్దిసేపు మసీదు చావడికి మధ్య పచార్లు చేసేవారు. తరువాత ఆరు గంటలకు హారతి కార్యక్రమం పూర్తయ్యేది.
అప్పుడు కొంతసేపు సత్కాలక్షేపం జరిగేది.
ఆ తరువాత తనకు దక్షిణ రూపంలో వచ్చిన పైకాన్నంతా బాబా అందరినీ పిలిచి పంచేసేవారు.
రాత్రి భక్తులందరూ భోజనాలకు తమ ఇళ్లకు వెళ్లినప్పుడు తొమ్మిది గంటల ప్రాంతంలో తాత్యా కొన్ని రొట్టెలు తెచ్చి బాబాకు ఇచ్చేవాడు.
బాబా వాటిని తీసుకుని అతనికి ముప్ఫయ్ అయిదు రూపాయలు ఇచ్చేవారు.
బాబాకు తాంబూలం అంటే మహా ఇష్టం.
రాత్రీ పగలూ వాటిని తరుచుగా తీసుకునేవారు.
అవి తిన్నాక బాగా నీళ్లు తాగేవారు.
అనంతరం పవళింపు(శేజారతి) హారతి జరిగేది. హారతి పూర్తవగానే బాబా నిద్రకు ఉపక్రమించేవారు.
🌹సేకరణ 🌹🙏
🌹శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై🌹
Comments
Post a Comment