జై గురు దత్త దత్త' అనే రెండక్షర నామమే మహామంత్రం.
జై గురు దత్త 🙏
మాలా కమండలు రథః కరపద్మ యుగ్మే
మధ్యస్థ పాణి యుగళే ఢమరు త్రిశూలే
యస్యస్త ఊర్ధ్వ కరయోశ్శుభశంఖచక్రే
వందే తమత్రి వరదం భుజషట్కయుక్తమ్
దత్తాత్రేయం శివం శాంతం సచ్చిదానంద మద్వయం
ఆత్మరూపం పరం దివ్యం అవధూత ముపాస్మ హే
🌹బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన దత్తాత్రేయులవారి రూపంలో ముమ్మూర్తుల ఏకత్వం ప్రకాశిస్తోంది.
స్వామి ఆరు చేతులతో ప్రకాశిస్తున్నాడు.
క్రింది రెండు చేతులలో అక్షమాల, కమండలం ధరించాడు (బ్రహ్మ),
మధ్య చేతుల్లో ఢమరుకం, త్రిశూలం దాల్చాడు (శివుడు),
పైరెండు చేతుల్లో శంఖు చక్రాలు ధరించాడు (విష్ణువు)
ఇలా ఆరు చేతులతో ప్రకాశిస్తూ, అత్రికి వరాన్ని అందించిన దత్తాత్రేయునికి వందనం... శాంత స్వరూపంతో దీపించే సచ్చిదానందరూపుడు, అద్వయుడు, ఆత్మరూపుడు, సర్వోన్నతుడు, దివ్యుడు, అవధూత దత్తాత్రేయుని ఉపాసిస్తున్నాను.
🌹దత్త’ ఇత్యక్షరద్వయమ్
🌹‘దత్త' అనే రెండక్షర నామమే మహామంత్రం.
ఆ నామాన్ని స్మరించినంత మాత్రానికే స్వామి అనుగ్రహిస్తాడు.
🌹‘దత్తా దత్తా’ అని పిలిచినంతనే, ఆయన భక్తుల ప్రక్కనే నిలిచి, వారి కష్టనష్టాలను, సకల వ్యాధి బాధలను, గ్రహపీడలను, అపమృత్యువును తొలగించి, భక్తుల మనోభిష్టాలను తీరుస్తుంటాడు.
🌹ఆయన ఈ సమస్త జగత్తును అంధకారం నుండి కాంతిపథం వైపు నడిపించడానికి అవతరించిన జగద్గురువు.
ఆయన ఆవిర్భావమే మహిమాన్వితం.
🌹కౌశికుని భార్యకు తన భర్త సూర్యోదయమైనంతనే మరణిస్తాడని తెలుస్తుంది.
ఆమె, తన పాతివ్రత్య మహిమతో అసలు సూర్యోదయమే కాకూడదని శాసించింది.
ఆమె ఆనతితో సూర్యోదయం ఆగిపోవడంతో సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి.
అప్పుడు దేవతలంతా పరుగుపరుగున వెళ్ళి అనసూయాదేవిని శరణుజొచ్చారు.
జగదాంబిక అంశతో జన్మించిన అనసూయ, కౌశికుని భార్యని పిలిచి ఓదార్చి, తన శక్తితో ఆ మునిని బ్రతికిస్తుంది.
🌹అనసూయ పాతివ్రత్యాతేజాన్ని చూసి అబ్బురపడిన త్రిమూర్తులు, అంశరూపాలతో ఆమెకు కుమారులవుతారు.
అలాగే ఆమె భర్త అత్రిమహర్షి అంతకుముందే త్రిమూర్తులను పుత్రులుగా పొందే వరాన్ని పొందాడు.
🌹బ్రహ్మ అంశతో ‘చంద్రుడు’, రుద్రాంశతో ‘దుర్వాసుడు’ అవతరించగా,
త్రిమూర్తుల అంశలను కలుపుకుని విష్ణువు ‘దత్తుడు’గా అవతరించాడు.
🌹భక్తులకు లోకాన్ని ఏలే తండ్రిగా కంటే పుత్ర సమానుడిగా సేవలు అందిస్తాడు.
తన మహిమలు చూపడం కంటే భక్తుల మహిమల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చి, వారి కీర్తిని పెంచుతాడట.
అందుకే... "భక్త కీర్తి వివర్థనుడు"గా కీర్తి పొందాడు.
🌹ఆయనను దిగంబరుడు అనీ అంటారు.
అంటే నగ్నం అని కాకుండా 'దిగంతాలనే అంబరాలు'గా చేసుకున్నవాడని అర్థం చెబుతారు.
🌹ఏ అవతారానికి లేని 'గురుదేవ' అనే విశేషణం దత్త ప్రభువుకు మాత్రమే ఉంది.
🌹అరిషడ్వర్గాలు కలి ప్రభావంతో పెచ్చరిల్లుతూ
మానవ జీవితం పతనం వైపు ప్రయాణించడాన్ని
నివారించి మనిషిని మనీషిగా చేయాలన్నదే ఈ అవతార తత్వం.
మానవులకు జ్ఞానభిక్ష, ధర్మరక్షణ ఈ అవతార లక్ష్యం.
Comments
Post a Comment