అరుణాచల దీపోత్సవం (కార్తీకదీపం)
ఓం నమః శివాయ 🙏
కృత్తికా దీపోత్సవం
ఆ పర్వతమే ఒక మహాలయం… అదే పరమ పావనం అయిన అరుణగిరి.
విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం... "గిరి" రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం.
తిరువణ్ణామలై అంటే "శ్రీకరమైన మహాగిరి" అని అర్థం.
ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి.
అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని అంటారు.
ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం.
కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు.
ఆయన ధ్యానానంతరం కళ్ళు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు
అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని భగవాన్ రమణమహర్షి పేర్కొన్నారు.
కార్తీక మాసములో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున శ్రీ అరుణాచల గిరిపైన మహా జ్యోతిని ప్రజ్వలింపజేస్తారు.
దీనినే "కృత్తికా దీపోత్సవం" (అరుణాచల కార్తీకదీపం) అంటారు.
ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద రాగితో చేయబడుతుంది.
ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600 మీటర్లతో చేయబడుతుంది.
ఈ ప్రమిదను, వత్తిని... "జ్యోతి నాడార్" లేక "దీప నాడార్ ” అని పిలువబడే వంశస్తులు మాత్రమే అందజేస్తారు.
ఇక 2500 కిలోల నెయ్యి అరుణాచలానికీ వచ్చే భక్తులు అందజేస్తారు.
అలా వెలిగించిన అరుణాచల మహా దీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది. సుమారు 24 కిలోమీటర్ల మేరకు ఈ దీపం దర్శనమిస్తుంది.
గత జన్మల పుణ్యం ఉంటేనే కానీ ” అరుణాచలం" అనే పదాన్ని కూడా తలవలేమని స్థల పురాణం చెబుతోంది.
ఒక్కసారి అరుణాచలగిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకూ వారు చేసిన పాపాలు, వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారబ్ధ, సంచిత పాప కర్మలు సైతం పటా పంచలవుతాయనీ...
ఎవరైనా మరణించి నరకానికి వస్తే, వారి జీవితంలో అరుణాచలగిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడట.
ఒకవేళ వారి పుణ్యం కొలదీ అరుణాచలగిరి ప్రదక్షిణ చేసినట్లయితే, వారి జీవితాన్ని అరుణాచలగిరి ప్రదక్షిణకు ముందు...
అరుణాచలగిరి ప్రదక్షిణ తరువాతగా విభజించి...
గిరి ప్రదక్షిణకు ముందు చేసిన పాపం రాశులను లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యంలో ఉన్నది.
ఓం అరుణాచలేశ్వరాయ నమః
-- సత్య వాడపల్లి
Comments
Post a Comment