💥 మాఘపురాణం - 12వ అధ్యాయము

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥 మాఘపురాణం - 12వ అధ్యాయము


పుణ్యక్షేత్రములలో మాఘస్నానము


అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా “మహర్షీ! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. నాకు మరొక సంశయం కలిగింది. మాఘమాసమందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవివ్వమని వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు -


దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించు.


మాఘమాసంలో నదీస్నానం ముఖ్యమైనది. మాఘ స్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానము. మాఘమాసంలో నదీస్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘ స్నాన మాచరించిన ఏడేడు జన్మలలోని పాపములు నశించిపోతాయి. మాఘమాసంలో నదీస్నానంతోపాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలం కలుగుటయే గాక మళ్ళీ జన్మ అనేది కలుగదు.


పడమటి కనుమల దగ్గర త్ర్యయంబకమను ఒక ముఖ్యమైన క్షేత్రం ఉన్నది. అక్కడే పవిత్ర గోదావరీనది జన్మించింది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి, గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింప చేసాడు. మాఘమాసంలో గోదావరియందు స్నానం చేసినయెడల సకలపాపములు తక్షణం హరించి పోవుటయే గాక ఇహమందు పరమందు సుఖపడతారు.


గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుతున్నవి. ‘పరంతప’ అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి ఉన్నాడు. దానికి ఆవల ప్రభావమను క్షేత్రం గలదు. ఆ క్షేత్రం బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము చెపుతాను సావధానుడవై ఆలకించు.


విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు, ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడు నాకు అయిదు తలలున్నవి, నేనే గొప్పవాడనని అనగా నాకు ఐదు తలలున్నవి నేనే గొప్ప వాడనని శివుడు వాదించారు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరిమధ్య కలహము పెద్ది అయింది. ఇద్దరూ యుద్ధముచేయగా శివుడు బ్రహ్మయొక్క ఐదవ తలను నరికివేసాడు. అందువలన శివునకు బ్రహ్మ హత్యాపాతకము చుట్టుకున్నది.


శివుడు నరికిన బ్రహ్మ తలను చేతితో పట్టుకొని ముల్లోకములు తిరుగుతూ ఉండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మ తల ఎండిపోయి పుర్రెగా అయింది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి ‘భిక్షాందేహి’యని అనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము వద్దకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్షవేసి శివుని వెంట వెళ్ళిపోతున్నారు. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి, కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక, ఈతనికి పురుషత్వము నశించుగాక అని శపించారు.


ఈశ్వరుడు చేసేది లేక జారి క్రిందపడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా? అన్నట్లు భయంకరముగా ఉన్నది. బ్రహ్మ, విష్ణువు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకుని వెళ్ళగా అచ్చట శివునికున్న బ్రహ్మహత్య పాపము పోయింది. భూలోకమునకు వచ్చిన శివుడు లింగాకారముగా మారినందున అప్పటినుండి భక్తులు ఆ లింగమునే పూజించుచు శివసాన్నిధ్యము పొందగలుగుతున్నారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు