💥మాఘ బహుళ చతుర్దశి "మహాశివరాత్రి

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🔱హర హర మహాదేవ శంభో శంకర 🔱


💥మాఘ బహుళ చతుర్దశి "మహాశివరాత్రి"


మాఘే కృష్ణ చతుర్ధశ్యాం ఆదిదేవో మహానిశి

శివలింగ తమోద్భూతః కోటి సూర్య సమప్రభః 

తస్మాచ్చివ స్యయా రాత్రి: సమాఖ్యాతా శివప్రియా 

తస్యాం సర్వేషు లింగేషు సదా సంక్రమతే హరః 


💥పరమశివుడు మాఘకృష్ణ చతుర్దశి నాడు నిశీది సమయంలో కోటి సూర్యుల కాంతితో శివలింగ రూపంలో ఆవిర్భవించాడు.

ఈ రాత్రి శివునికి చాలా ప్రియమైన రాత్రి.

శివలింగాలన్నీ శివతేజస్సుతో ప్రకాశిస్తాయి. ఈ రోజునే "మహాశివరాత్రి" అంటారు.


శివరాత్రి వ్రతం నామ సర్వపాప ప్రణాశనమ్ 

అచండాల మనుష్యాణాం మోక్ష ప్రదాయకమ్


శివరాత్రి వ్రతం సర్వపాపాలను హరింపజేసి సర్వులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది.


🌹శివరాత్రి వ్రతం తనకెంతో ప్రియమైనదని, ఈ వ్రతం సర్వయజ్ఞ సమానమని, ఉత్తమోత్తమైన ఈ వ్రతమును ఒక్కసారి చేసిన వారు ముక్తిని పొందుతారని పరమశివుడు పార్వతిదేవికి చెప్పినట్లుగా లింగపురాణం తెలియజేస్తుంది.


అందుకే పెద్దలు "జన్మానికో శివరాత్రి" అని అంటారు.


🌹నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహా శివరాత్రి అని నాలుగు శివరాత్రులున్నట్లుగా శాస్త్రం తెలుపుతుంది.


నిత్యశివరాత్రి :- ప్రతి దినమూ రాత్రి శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి.


పక్షశివరాత్రి :- ప్రతి నెలా చతుర్ధశిన ఉపవాసముండి రాత్రి శివుడిని ఆరాధించడం.


మాసశివరాత్రి :- ప్రతి నెలా కృష్ణ చతుర్ధశిన నియమ నిష్టలతో శివారాధన చేయడం.


మహాశివరాత్రి :- మాఘమాస బహుళ చతుర్ధశిన పరమేశ్వరుణ్ణి భక్తిప్రపత్తులతో శాస్త్రబద్ధంగా ఆరాదించడం.


నిత్య, పక్ష, మాస శివరాత్రులను ఆచరించకపోయిన మహా శివరాత్రిని ఆచరించిన చాలు, అనంతమైన పుణ్యం లభిస్తుందని, ముక్తి ప్రాప్తమౌతుందని స్కాంద, శివ పురాణంలందు వివరింపబడింది.


🌹పూర్వం సృష్టికర్త బ్రహ్మదేవుడికి, విష్ణువుకు మధ్య తమలో ఎవరు గొప్పవారనే బేధభావం వచ్చి వాదులాడుకొని శివుడిని చెప్పమని అడగగా వారి తగవు తీర్చేందుకై శివుడు వారిద్దరి మధ్య అనలస్తంభంగా ఆవిర్భవించాడు.


తన ఆది అంతాలను ఎవరు కనుగొంటారో వారే గొప్పవారని శివుడు చెప్పగా శివుని ఆది అంతాలను కనుగొనేందకు బ్రహ్మదేవుడు హంసరూపంలో ఆకాశంవైపు, మహావిష్ణువు వరాహరూపంలో పాతాళానికి వెళ్ళారు.


ఎంత దూరం పయనించి వెదికినా వారు శివుని ఆది అంతమలు కనుగొనలేక శివుని దగ్గరకు వచ్చి ప్రార్ధించగా వారిద్దరి మధ్య లింగరూపంలో ఆవిర్భవించాడు.

ఈ విధంగా ప్రత్యక్షమైన మూర్తే "లింగోద్భవమూర్తి"


ఈ లింగోద్భవం రాత్రిపూట జరిగింది.

అందుచే మహాశివరాత్రి పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట శివాభిషేకాలు, శివస్మరణం చేస్తూ, శివగాధలు వింటూ జాగరణ చేయమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. 


ఉపవాసమనగా దైవమందు వసించడం. అంటే త్రికరణశుద్ధిగా శివున్నే ధ్యానిస్తూ, శివ నామాన్నే స్మరిస్తూ, శివుని యందే లగ్నమై ఉండడం.


మహాశివరాత్రిన అభిషేకాలు, పూజలు రాత్రియందే చేయడం ఎంతో శ్రేయస్కరం.


🌹రాత్రి నాలుగు ఝాముల్లో నాలుగు విధములుగా ఈ అభిషేకాలు చేయాలన్నది శాస్త్రవచనం.


మొదటి ఝామున శివునికి క్షీరంతో అభిషేకించి, పద్మాలతో పూజ చేస్తూ పులగమును (బియ్యం పెసరపప్పు కలిపి వండినది) నైవేద్యంగా సమర్పిస్తూ ఋగ్వేద మంత్రాలను చదవాలి.


రెండవ ఝామున పెరుగుతో అభిషేకించి, తులసీదళములతో పూజిస్తూ పాయసమును నైవేద్యంగా సమర్పిస్తూ యజుర్వేద మంత్రాలను చదవాలి.


మూడవ ఝామున నెయ్యితో అభిషేకించి, మారేడుదళములతో పూజ చేస్తూ నువ్వులతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పిస్తూ సామవేద మంత్రాలను చదవాలి.


నాల్గవ ఝామున  తేనెతో అభిషేకించి, తుమ్మిపూలతో పూజించి అన్నమును నైవేద్యంగా సమర్పిస్తూ అధర్వ మంత్రాలను చదవాలి.


🌹ఇవేవి చేయకపోయినను శివుడు "అభిషేకప్రియుడు" కావున శివలింగముపై శివరాత్రినాడు నీటిని పోసి మారేడుదళములను సమర్పించిన విశేషమైన పుణ్యం లభిస్తుందని లింగపురాణం తెలుపుతుంది. 

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు